● వినూత్న యాప్ తీసుకొచ్చిన కలెక్టర్
● రోజువారీ కార్యకలాపాలు
ఇక ఒకే వేదికపై పర్యవేక్షణ
జనగామ: అంగన్న్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించేందుకు జిల్లాలో తొలిసారిగా ‘శిశు మహిళా సమృద్ధి’ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో యాప్ను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రారంభించారు. వినూత్న ఆలో చనతో కలెక్టర్ స్వయంగా యాప్ను రూపొందించారు. అంగన్వాడీ కేంద్రాల రోజువారీ కార్యకలాపాలను ఒకే వేదికపై పర్యవేక్షించడమే యాప్ ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. దీని ద్వారా అంగన్వాడీ సిబ్బందిపై ఉన్న రిజిస్టర్లు, పునరావృత నివేదికల భారం తగ్గుతుందన్నారు. ఒకసారి నమోదు చేసిన సమాచారం అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.
నాలుగు ప్రధాన సదుపాయాలు
యాప్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరు నమోదు, పోషకాహార నిల్వలు, కేంద్రాల పనితీరు పర్యవేక్షణ, సిబ్బంది సెలవుల దరఖాస్తు సదుపాయాలను కల్పించామన్నారు. హాజరు వివరాలను రియల్ టైమ్లో నమోదు చేయడంతో గైర్హాజరవుతున్న లబ్ధిదారులను గుర్తించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. పోషకాహార నిల్వల వివరాలతో అవసరమైన సరఫరాను ముందుగానే అంచనా వేయవచ్చని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మొబైల్ నుంచే సెలవులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫొటో, లొకేషన్తో హాజరు నమోదు చేయడంతో పాటు నెట్వర్క్ లేని ప్రాంతాల్లోనూ వివరాలు భద్రపడి, సిగ్నల్ వచ్చిన తర్వాత స్వయంచాలకంగా చేరుతాయని చెప్పారు. యాప్ వినియోగంపై రెవెన్యూ అదనపు కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి బెన్షాలోమ్ ఆధ్వర్యంలో అంగన్న్వాడీ టీచర్లు, హెల్పర్లు, సూపర్వైజర్లు, సీడీపీఓలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను మెరుగుపర చడమే యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు.


