జనగామ: ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు, మహిళా కౌన్సిలర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు. గోరింటాకును అక్కడికక్కడే తయారు చేసుకుని ఒకరికొకరు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలోని పండుగలు, సంప్రదాయాలకు గత పదేళ్లలో పూర్వ వైభవం తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కొనియాడారు.


