● ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
సందీప్ కుమార్ ఝా
● పాలకుర్తి మండలంలో
అభివృద్ధి పనుల పరిశీలన
జనగామ: చేనేత కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని పే ర్కొన్నారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో నేతన్న బీమా పథకం కింద మంజూరైన చెక్కులను చేనేత లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ఏడీ బాబు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, లబ్ధిదారులు దోర్నాల వెంకన్న, వేముల బాలరాజు, గుర్రం బాలరాజు, ఎనగందుల కృష్ణ, సర్పంచ్ బల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి..
పాలకుర్తి టౌన్: అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. శుక్రవారం మండలంలోని గూడూరులో డబుల్ బెడ్రూం లేఅవుట్లో నిర్మించిన సీసీరోడ్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ తనిఖీల్లో గృహనిర్మాణ శాఖ పీఈ మాతృనాయక్, ఈఈ ప్రవీణ్కుమార్, డీఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సమీకృత వ్యవసాయ క్షేత్రం పరిశీలన..
గూడూరు గ్రామంలో సంపత్ అనే రైతు నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించి పంటలు, పౌల్ట్రీ యూనిట్ను పరిశీలించారు. ఈసందర్భంగా జొన్న, పత్తి, బెండ సాగు వివరాలు, విస్తీర్ణం, దిగుబడిపై రైతును అడిగి తెలుసుకున్నారు. పౌల్ట్రీ యూనిట్లో సుమారు 6 వేల కోళ్లు ఉన్నట్లు రైతు వివరించగా, కోళ్ల పెంపకానికి పట్టే కాలం, దాణా ఖర్చు, విద్యుత్ వినియోగం, మార్కెట్ ధరలు, విక్రయ విధానం వంటి అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. వ్యవసాయాన్ని విభిన్నీకరించడం ద్వారా ఆదాయం వనరులు పెరుగుతాయని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, కేవీకే శాస్త్రవేత్త రమ్య, వ్యవసాయ అఽధికారులు, రైతులు పాల్గొన్నారు.


