శిక్షణకు హాజరైన ప్రజాప్రతినిధులు, కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ప్రజాపాలనలో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్డులో గల శ్రీ భక్తమార్కండేయస్వామి, పద్మశాలి కల్యాణ మండపంలో జిల్లాలో నూతనంగా ఎన్నికై న ప్రజా ప్రతినిధులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా పది అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, ఆరోగ్యం, గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలను నిరంతం చేపట్టాలన్నారు. ముఖ్యంగా పది అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని వ్యవసాయం పద్ధతులు, పరికరాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల బలో పేతం, పర్యావరణం, నీటి సంరక్షణ, గ్రామీణ క్రీడలు, మహిళ సంక్షేమ పథకాలు, వడ్డీలేని రుణాలు, గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరు క్షేమంగా ఇంటికి చేరాలంటే కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను అరికట్టడంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేసి, అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బూష పర్వతాలు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీలరాజమ్మ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజాప్రతినిధులకు ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై శిక్షణ


