సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న నాయకులు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా వస్తున్న నాయకులు
జనగామ: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. నిరుద్యోగ యువతీ, యువకులు, విద్యార్థులతో కలిసి ఆర్టీసీ చౌరస్తా నుంచి ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చే క్రమంలోనే.. సీఐ ఎలబోయిన శ్రీనివాస్, ఎస్ఐ సృజన్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి చాలా మంది విద్యార్థులను వెనక్కి పంపించారు. పలువురు నాయకులు, విద్యార్థులు మాత్రం పోలీసుల కళ్లు గప్పి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. టీఎస్పీఎస్సీని వెంటనే రద్దుచేసి పూర్తిగా పక్షాళన చేయాలని ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మాచర్ల రాంబాబు డిమాండ్ చేశారు. చైర్మన్, సెక్రటరీ, బోర్డు మెంబర్లను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ వరంగల్ విభాగ్ కన్వీనర్ చింతకింది సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట హృతిక్ సాయి, శివ, పట్టణ కార్యదర్శి ఉమేష్, అరవింద్, వంశీ, నవీన్, నరేష్, భాను, కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.
పేపర్ లీకేజీపై విచారణ జరపాలి
జనగామ రూరల్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పేపర్ లీకేజీ ఒక శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సందీప్, రంజిత్, మహేష్, పాండు, అనిత, పల్లవి పాల్గొన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
ఏబీవీపీ నాయకుల అరెస్ట్