కోరుట్ల: పట్టణంలో త్వరలో ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. తనతండ్రి, మాజీమంత్రి జువ్వాడి నర్సిగరావు హయాంలోనే కోరుట్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వెటర్నరీ విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, ఫిల్టర్బెడ్, మున్సిపల్ కార్యాలయ భవనం, 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటవుతోందని తెలిపారు. ఈఎస్ఐ కార్డు ఉన్న వారికి ఉచితంగా సేవలు అందుతాయన్నారు. సాధారణ వైద్య పరీక్షలు, కంటి, దంత, ఈఎన్టీ, చర్మవ్యాధులకు చికిత్స అందించి ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గానికి ఇప్పటివరకూ రూ.7.51 కోట్లు సీఎం సహాయనిధి డబ్బులు అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తేవాలన్నారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బి రోడ్ల అభివృద్ధికి రూ.80కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, మంత్రి వివేక్కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, వైస్ చైర్మన్ మిద్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, పన్నాల అంజిరెడ్డి, నాయకులు కొంతం రాజం, సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


