మేడిపల్లి: విద్యుత్ కోతలతో అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ గురువారం కిసాన్మోర్చా ఆధ్వర్యంలో మండలకేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ప్రధాన కార్యదర్శి కారండ్ల మధుకర్ హాజరయ్యారు. అధికారంలోకి రాకముందు రైతుల కోసం అనే హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అరిగోసపెడుతోందని విమర్శించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. 24 గంటలు కరెంటు ఇవ్వాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు కలుగజేసుకుని ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల సురేష్, రాష్ట్ర నాయకులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, అన్నాడి జలపతిరెడ్డి, ఎస్ఎన్.రెడ్డి, క్యాతం దశరథరెడ్డి, నాయకులు రెబ్బస్ మల్లయ్య, తొగరి లక్ష్మిపతి, చంద రమేశ్, గోస్కి మధు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్లో..
రాయికల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ పట్టణంలోని సబ్స్టేషన్ వద్ద జగిత్యాల వెళ్లే రహదారిపై రైతులు గురువారం ధర్నాకు దిగారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పొలాలకు నీరు అందడం లేదని, వర్షాలు లేక.. సకాలంలో విద్యు త్ రాక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై సుధీర్రావు, సబ్ ఇంజినీర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.


