జగిత్యాలరూరల్: పంటల సాగు వివరాలు పక్కాగా లెక్కగట్టేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈనెల చివరి వరకు సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా పరిధిలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున జిల్లావ్యాప్తంగా 289 మందిని నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పంటల వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సెల్ ఫోన్ యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 3,76,629 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. వలంటీర్లు వివరాల నమోదులో బిజీగా మారారు.
జిల్లాలో 2,92,860 ఎకరాల్లో వరిసాగు
జిల్లాలోని 20 మండలాలు 385 గ్రామాల్లో రైతులు మొత్తం 3,76,629 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 2,92,860 ఎకరాల్లో వరి, ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకాలు 2,06,074 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇతర సన్నరకాలు 21,486 ఎకరాలు, అలాగే దొడ్డురకం 65,300 ఎకరాల్లో రైతులు సాగుచేశారు.
289 మంది వలంటీర్లు
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్కరు చొప్పున 289 మంది వలంటీర్లను నియమించారు. వారు తమకు కేటాయించిన గ్రామాల్లో 10 రోజులుగా సర్వే చేస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్రతి రైతు తనకున్న భూమిలో ఏయే పంటలు సాగు చేశారన్నది పూర్తిస్తాయి వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు.
ఆన్లైన్లో శిక్షణ
యాప్ వినియోగం, పంటల సాగు నమోదు విషయాలపై వలంటీర్లకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. వలంటీర్లు గ్రామాల్లో సర్వే చేసి ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల్లో తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రతీరోజు యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.


