● కరీంనగర్లో 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ పోటీలు ● ఈనెల 11, 12వ తేదీన నిర్వహణ ● 890 మంది క్రీడాకారుల రాక
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి యోగా క్రీడలకు కరీంనగర్ వేదిక కానుంది. 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆదేశాల మేరకు, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో ఈ నెల 11,12న పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలురు, 400 మంది బాలికలు, 50 మంది కోచ్లు, మేనేజర్లు, 40మంది రిఫరీలు, కలిపి మొత్తం 890 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 8–10, 10–12, 12–14 సంవత్సరాల సబ్జూనియర్ విభాగాలతో పాటు 14–16, 16–18 సంవత్సరాల జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30మందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు.


