వినాయక విగ్రహాల రవాణా విషాదం కావొద్దు ఉత్సవాల్లో అపశ్రుతులకు తావివ్వొద్దు గతేడాది కోరుట్లలో విద్యుత్షాక్తో ఇద్దరు మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు
జగిత్యాలక్రైం: పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా గణేశ్ నవరాత్రోత్సవాల సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను మండపాలకు ఆహ్వానించేందుకు యువత, ఉత్సవ కమిటీలు పోటీపడుతూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. అయితే భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా సాగాల్సిన గణేశుడి ఆగమనం.. కొన్నిసార్లు ప్రమాదాలకు వేదికవుతోంది. గతంలో వినాయకుడి విగ్రహాన్ని మేళతాళాలు, భజనలతో మంగళకరమైన వాతావరణంలో మండపానికి తీసుకొచ్చేవారు. కొన్నేళ్లుగా మహారాష్ట్ర తరహాలో ఆగమనం పేరిట ఇటీవల విపరీత పోకడలు పెరిగిపోయాయి. ట్రాలీలు, లారీలపై వేలాడే భారీ డీజే సౌండ్ బాక్సులు, ఊపిరాడకుండా కాల్చే బాణసంచా పొగ, యువకుల చిందులు.. వెరసీ కొన్నిచోట్ల ప్రమాదకర విన్యాసంగా మారుతోంది. ఆర్భాటం, సోషల్ మీడియాలో రీల్స్ మోజు, విచ్చలవిడి పోటీతత్వం కారణంగా ఏర్పాటు చేస్తున్న డీజేలు, కళ్లు బైర్లు కమ్మేలా లేజర్ లైట్లు, ట్రాఫిక్ను స్తంభింపజేస్తూ చేస్తున్న విన్యాసాలు పండుగ ఆనందాన్ని మిగల్చకపోగా.. పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికార యంత్రాంగం సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.
ఆదేశాలు పాటించాల్సిందే..
నిబంధనలు కఠినతరం
నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆగమనం పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజేలపై నిషేధం ఉంది. రహదారులపై ట్రాఫిక్కు ఆటంకం కలిగించొద్దు. విగ్రహాల తరలింపు వేళ ప్రమాదకర స్టంట్లు చేయొద్దు.
– అశోక్కుమార్, ఎస్పీ


