● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి ● షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్పై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
జగిత్యాలక్రైం: రాష్ట్ర సాధకుడు కేసీఆర్కు కీడు జరగాలని కోరుకోవడం నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ చావు కోరుతూ డప్పు కొట్టిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్పై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ కరుణాకర్కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ చావు కోరుతూ డప్పు కొట్టిన ఎమ్మెల్యే శంకర్తోపాటు, ఆ నేరాన్ని ప్రోత్సహించిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. పార్టీలపరంగా భిన్నాభిప్రాయాలున్నా నేరాన్ని ప్రోత్సహించేలా ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ చావు కోరడం క్షమించరాని నేరమన్నారు. అసెంబ్లీలో జవాబు చెప్పలేక బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారన్నారు. శాసనసభ, పార్లమెంట్కు డ్రెస్కోడ్ ఉండదని, నల్ల దుస్తులతో నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, అవమానించడం బాధాకరమన్నారు. అదే అసెంబ్లీలో బీజేపీ నాయకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. కేసీఆర్ హయాంలో 24గంటలు సరఫరా అయిన విద్యుత్.. రేవంత్ పాలనలో ఎప్పుడు పోతుందో తెలియడం లేన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. కేసీఆర్ చావు డప్పు కొడతానన్న ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు ఖండించారు. ఎమ్మెల్యే శంకర్పై పోలీసులు సుమోటాగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు విజయలక్ష్మీ, దేశాయ్, బీఆర్ఎస్ నాయకులు వొల్లం మల్లేశం, శివకేసరిబాబు, దుర్గన్న, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.


