కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్గా పరిచయం చేసుకుని ప్రభుత్వశాఖలు, యూని వర్సిటీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన దుడపాక తిరుపతి అలియాస్ తిరుపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 21మంది నుంచి రూ.44 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారించారు. కేసు వివరాలను టూ టౌన్ పోలీస్స్టేషన్లో మంగళవారం టౌన్ ఏసీపీ వెంకటస్వామి వెల్లడించారు. నగరంలోని విద్యానగర్లో అద్దెకుంటున్న దుడపాక తిరుపతిరావు శాతవాహన యూనివర్సిటీలో బోట నీ ప్రొఫెసర్గా చెప్పుకుంటూ తిరిగేవాడు. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. విద్యానగర్కు చెందిన పురుషోత్తం మమత కూతురు కీర్తనకు శాతవాహన యూనివర్సిటీలో డేటాఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు రూ.1.50 లక్షలు డిమాండ్ చేశాడు. మమత రూ.65వేలు నగదుగా ఇచ్చింది. మరో రూ.85వేలు తిరుపతి భార్య లావణ్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది. కొద్దిరోజులకు కీర్తనకు రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చిందని నకిలీ నియామక ఉత్తర్వులు సృష్టించాడు. విషయం తెలిసి మమత బంధువులు సైతం తిరుపతిని సంప్రదించడంతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి సుమారు రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. వారికి నియామక పరీక్షలు నిర్వహించి, ఓఎంఆర్ షీట్లు కూడా తయారు చేశాడు. ఇందుకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్లో ఓ టీంను ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తంగా 21మంది నుంచి రూ.44లక్షలు తీసుకున్నాడు. తరువాత తిరుపతి ఇచ్చినవి నకిలీ నియామక పత్రాలుగా రుజువు కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దుడపాక తిరుపతిరావును టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. తిరుపతికి ఈట్ల సత్యం, రాజశేఖర్తో పాటు మరికొందరు సహకరించారని, వారిని త్వరలో పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు.
ప్రధాన నిందితుడు దుడపాక తిరుపతి అరెస్ట్
వివరాలు వెల్లడించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి


