జగిత్యాల: సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, అది జగిత్యాల నుంచే ప్రారంభమైందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లాకేంద్రంలో చేసిన ధర్నాలో మాట్లాడారు. జగిత్యాల ఉద్యమాల గడ్డ అని, రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం నిజమవుతోందన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చుతున్నారని, కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీరు తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. ఎల్నినో ప్రభావంతో యాసంగి చేసుకునే పరిస్థితి లేదన్నారు. యూరియా సరఫరాపై అనేక ఆంక్షలు పెట్టి రైతులను గోస పెడుతున్నారని, వెంటనే యాప్ తొలగించి రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుల కోసం రైతుబీమా, రైతుభరోసా ప్రవేశపెట్టారని, ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేశారని, వైఎస్సార్ ప్రారంభించిన పథకాలు కేసీఆర్ పటిష్ఠంగా అమలు చేశారని, కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందోనని రేవంత్రెడ్డి పథకాలను అణగదొక్కుతున్నారని తెలిపారు. జగిత్యాల ప్రజలు కేసీఆర్ను చూసి ఇక్కడ సంజయ్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేవంత్రెడ్డి పక్కన చేరి గుట్టలు, భూములు దోచుకుంటున్నాడని విమర్శించారు. మహిళలను అవమానించిన రేవంత్రెడ్డి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ పెంపు, మహిళలకు రూ.2500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల హామీ నెరవేర్చలేదన్నారు.


