● రూ.25 లక్షల విలువ గల 28 బైక్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ శ్వేత
వరంగల్ క్రైం: వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగలను సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బైక్ల చోరీలు చేసిన తరువాత నిందితులు అనంతరం చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నమోదైన కేసుల్లో బైక్ల రికవరీ కోసం సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మంచిర్యాల ఎన్టీపీసీ కాలనీకి చెందిన దొంతుల ప్రశాంత్ కుమార్, మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు ప్రయాణిస్తున్న బైక్ను స్వాధీనం చేసుకుని విచారించగా నిందితులు వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిపల్లి గ్రామం, ఎల్కతుర్తి శివారులో 28 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.
వాహనాల చోరీలు ఇలా...
నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు పలు జిల్లాలో వాహనాల చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్లో–8, కరీంనగర్ కమిషనరేట్లో –9, రామగుండం కమిషనరేట్ పెద్దపల్లిలో –3, సిద్దిపేట కమిషనరేట్లో –2 హైదరాబాద్ కమిషనరేట్లో–3, రాచకొండ కమిషనరేట్లో –1, భూపాలపల్లి జిల్లాలో –2 మొత్తం 28 బైక్లు చోరీ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహరావు, సీసీఎస్ ఏసీపీ సదయ్య, కేయూ ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, హరికృష్ణ, రామకృష్ణ, సిబ్బందిని సీపీ అభినందించారు.


