కథలాపూర్: సెల్ఫోన్, కంప్యూటర్ యుగంలో విద్యార్థుల్లో క్రమంగా పుస్తక పఠనం అలవాటును పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొదటి దశ కింద 18 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు చేయనుంది. ఎంపికై న బడుల్లో గ్రంథాలయం నిర్వహణకు తొలుత రూ.15వేలను పాఠశాల కమిటీ పేరిట నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసి గ్రంథాలయం నిర్వహిస్తే ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందించనున్నారు. గ్రంథాలయాల్లో కథలు, జీవితచరిత్రలు, సైన్స్, సాహిత్యం, పోటీ పరీక్షలు, బాల సాహిత్యం పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గ్రంథాలయం శాఖ అధికారులు తెలిపారు.
ఎంపికై న జెడ్పీ హైస్కూళ్లు ఇవే..
కథలాపూర్ మండలంలో కథలాపూర్, అంబారిపేట, బీర్పూర్ మండలంలో తుంగూర్, జగిత్యాల రూరల్ మండలంలో పొరండ్ల, జగిత్యాల పట్టణంలో పురాణిపేట, ఓల్డ్ హైస్కూల్, మేడిపెల్లి మండలంలో కొండాపూర్, మల్లాపూర్ మండలంలో వీవీ.రావుపేట, మెట్పల్లి పట్టణంలో బాలికల, బాలుర పాఠశాల. కోరుట్లలో బాలుర, ప్రభుత్వ పాఠశాల, రాయికల్ మండలంలో భూపతిపూర్, అల్లీపూర్, రాయికల్ బాలికల పాఠశాల, వెల్గటూర్ మండలంలో వెల్గటూర్, ధర్మపురిలో బాలికల పాఠశాల, గొల్లపల్లి మండలంలో చిల్వకోడూర్ పాఠశాలలు ఎంపికయ్యాయి.
గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచే చదవడంపై దృష్టిసారించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రంథాలయాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పోటీ పరీక్షలకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
– శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి


