● టీపీవోపై వచ్చిన లంచం ఆరోపణ ● ఉన్నతాధికారులకు చేరనున్న నివేదిక
మెట్పల్లి: మెట్పల్లి బల్దియాలో టౌన్ప్లానింగ్ అధికారిగా పనిచేసిన రాజేంద్రప్రసాద్పై వచ్చిన లంచం ఆరోపణలపై ఆ విభాగం వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వందనం శనివారం మెట్పల్లికి వచ్చి విచారణ చేపట్టారు. పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన జగ్గుల లావణ్య తమ ఇంటిపై మరో అంతస్తు నిర్మాణం కోసం రాజేంద్రప్రసాద్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లింబాద్రి రూ.2లక్షల లంచం తీసుకుని నకిలీ అనుమతి పత్రాలు ఇచ్చారని గతంలో ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఫోన్పే ద్వారా వారికి చెల్లించినట్లు ఆధారాలు అందించింది. పరిశీలించిన ఆయన టీపీవో అవినీతికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి జూన్ 16న ఆయనను సస్పెండ్ చేస్తూ.. లింబాద్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశౠరు. పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీడీ మెట్పల్లికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో రాజేంద్రప్రసాద్, లింబాద్రి, లావణ్య నుంచి వేర్వేరుగా వివరాలు సేకరించారు. లావణ్య ఇంటిని సందర్శించి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆర్డీడీ తెలిపారు.
టీపీవోను ఉద్యోగం నుంచి తొలగించాలి
ఇంటి నిర్మాణ అనుమతులకు లంచం కోసం వేధింపులకు గురిచేసిన రాజేంద్రప్రసాద్ విషయంలో ఉన్నతాధికారులు సస్పెండ్కే పరిమితం కాకుండా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలని లావణ్య కోరింది. ఇల్లు తన పేరిట లేకున్నా.. నోటీసులు ఇచ్చి అప్పటి కమిషనర్ మోహన్, రాజేంద్రప్రసాద్, లింబాద్రి బ్లాక్మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్డీడీకి పూర్తి వివరాలు అందించానని, మరొకరికి ఇలా జరగకుండా ఉన్నతాధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


