రాయికల్: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలని, తప్పనిసరిగా అటెండెన్స్ బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలు, ఓపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మందుల నిల్వను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగీ వంటి వైరల్ ఫీవర్లు ప్రబలే అవకాశం ఉందని, మందులు అందుబాటులో ఉంచుకునేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో తాగునీటి సమస్యతోపాటు, పారిశుధ్య వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పునరావృతం కావొద్దని జిల్లా కో–ఆర్డినేటర్ రామకృష్ణకు సూచించారు. అనంతరం ఉప్పుమడుగులోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అక్కడి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలూరు గ్రామంలో నిర్మిస్తున్న వీవో భవనం, రాజనగర్ గ్రామంలో కల్వర్టు, వీరాపూర్లో అంగన్వాడీ కేంద్రం పనులను పరిశీలించారు. ఈనెల 30లోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మెడికల్ ఆఫీసర్ సతీశ్, జిల్లా ఆస్పత్రి కో–ఆర్డినేటర్ రామకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ శశికాంత్రెడ్డి, డీఈవో రాము పాల్గొన్నారు.


