చర్యలు తీసుకుంటాం..
మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి సొమ్మును స్వాహా చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. ఇతర ఆలయానికి వెళ్లిన అధికారులు స్థానిక నేతల అండతో మళ్లీ కొండగట్టులో పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది అధికారులు, అర్చకులు చేయి కలిపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండగట్టులో ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ జూనియర్ అసిస్టెంట్, మరో సీనియర్ అసిస్టెంట్పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. బదిలీ చేయించేందుకు ప్రజాప్రతినిధులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది. గతంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు అంజన్న నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొని, సస్పెన్షన్ను తప్పించుకునేందుకు మరో ఆలయానికి బదిలీపై వెళ్లిన అధికారులు మళ్లీ కొండగట్టులో పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. కొండగట్టులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులు తమ అవినీతికి అడ్డుగా ఉన్న అధికారులను తప్పించేందుకు తప్పుడు ఆరోపణలతో రాజకీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తూ.. అడ్డు తొలగించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. కొండగట్టు అంజన్న సొమ్ము రూ.52లక్షలు స్వాహా కేసులో ఆరోపణలు ఎదుర్కొని మరోచోటుకు బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉన్నతాధికారులు, మరో సీనియర్ అసిస్టెంట్ కొండగట్టులో తిరిగి పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.
అంజన్న నిధుల గోల్మాల్పై చర్యలకు ఆదేశాలు..
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 2022–23లో నిధుల గోల్మాల్పై బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్నెళ్ల కిత్రం దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఇంక్రిమెంట్లలో కోత పెట్టి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో టెండర్ల సొమ్ము రూ.52 లక్షలు ఆలయ ఖాతాలో జమ చేయాల్సి ఉండగా.. సొంతానికి వాడుకోవడంతో అప్పటి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారిని సస్పెండ్ చేశారు. ఏఈవో, సూపరింటెండెంట్కు నోటీసులు ఇచ్చి బదిలీ చేశారు. నిధుల గోల్మాల్ నిర్ధారణ కావడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్నెళ్ల క్రితం దేవాదాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. తాజాగా అదే అధికారులు కొండగట్టులో మళ్లీ పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కొండగట్టుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు
గతంలో అంజన్న నిధుల గోల్మాల్పై చర్యలకు ఆదేశం
ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టిన వైనం
కొండగట్టు ఆలయ నిధుల గోల్మాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు కొండగట్టులో పోస్టింగ్ ఇవ్వలేదు. ఆలయ నిధుల గోల్మాల్లో అధికారుల పాత్ర నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. ఈ మేరకు సదరు అధికారుల ఇంక్రిమెంట్లలో కోత పెట్టేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారి వివరణ తీసుకున్నాం. న్యాయసలహా ప్రకారం చర్యలు తీసుకుంటాం. కమిషనర్ ఆదేశాల మేరకే బదిలీలు జరుగుతున్నాయి.
– అంజనారెడ్డి, కొండగట్టు ఆలయ ఈవో


