మెట్పల్లి మండల గ్రామాభివృద్ధి సమీక్షలో అధికార పార్టీ సర్పంచ్ వ్యాఖ్యలు విద్యుత్ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన పరిష్కరించాలని విద్యుత్ శాఖకు సూచించిన ఆర్డీవో
మెట్పల్లిరూరల్: రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటినుంచే కరెంట్ సరిగ్గా ఉండడంలేదు.. ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మెట్పల్లి మండలంలోని వెల్లుల సర్పంచ్ తిరుపతి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల అభివృద్ధిపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పలు శాఖల అధికారులు వారివారి శాఖలపై వివరించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ సర్పంచ్ తిరుపతి కరెంట్ సమస్యపై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ సమస్య ఉందని, గ్రామాల్లో స్తంభాలు వేయడం లేదని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలను గమనించిన ఆర్డీవో నర్సింహారావు కల్పించుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఆర్డీవో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని, సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ నీత, ఎంపీడీవో మహేందర్, వైద్యాధికారి అంజిత్రెడ్డి, ఏవో దీపిక, పశువైద్యాధికారి అశ్విని, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.


