మల్యాల: తల్లి మరణంతో దిక్కుతోచని స్థితిలో పడిన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు ఆడపిల్లలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండగా నిలిచారు. ఇప్పటికే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన ఆయన.. సోమవారం ఇద్దరు చిన్నారులను గురుకులం పాఠశాలలో చేర్పించారు. తక్కళ్లపల్లికి చెందిన బూత్కూరి శారద, కనకయ్యకు కృష్ణవేణి, త్రివేణి, నీలవేని, మాహాన్విత కూతుళ్లు. కనకయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లివస్తున్నాడు. తల్లి శారద కూలీగా పనిచేస్తూ కూతుళ్లను చదివిస్తున్నాడరు. కృష్ణవేణి హైదరాబాద్లో బీటెక్ రెండో సంవత్సరం, త్రివేణి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం, నీలవేని తక్కళ్లపల్లి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి, మహాన్విత ఏడో తరగతి చదువుతోంది. శారద అనారోగ్యంతో ఇటీవల చనిపోగా.. వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి రూ.20వేలు అందించారు. ఇద్దరిని గురుకులంలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్తో మాట్లాడి గురుకులంలో సీట్లు కేటాయించేలా చూశారు. సోమవారం తక్కళ్లపల్లికి వెళ్లి నలుగురు పిల్లలకు నూతన వస్త్రాలు అందించారు. నీలవేణి, మహాన్వితను తన వాహనంలో తాటిపల్లి బాలికల గురుకులానికి తీసుకెళ్లి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. నలుగురు ఆడపిల్లల చదువు, భవిష్యత్కు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అలాగే గురుకులం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రిన్సిపాల్ మానస, తాటిపల్లి సర్పంచ్ మెట్పల్లి లత, తక్కళ్లపల్లి మాజీ సర్పంచ్ మరాటి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు దొంగ ఆనంద రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెవుల మద్ది శ్రీనివాస్, ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, నేరెళ్ల సతీశ్ రెడ్డి, పాల్గొన్నారు.


