జగిత్యాలక్రైం: దుబాయ్లో జూన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జిల్లాకు చెందిన కూలీల కుటుంబాలకు మంగళవారం ఆర్థిక సహాయం అందించారు. కూలీలను తీసుకెళ్తున్న మినీ బస్సు ముందున్న లారీని ఢీకొని ఏడుగురు చనిపోయిన విషయం తెల్సిందే. దీంతో దుబాయ్లో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్త షంషీర్ వయలిల్ వారి కుటుంబాలకు రూ.2.6 కోట్ల సహాయం ప్రకటించారు. కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సలీం సయ్యద్ హుస్సేన్, మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన తిరుపతి, గొల్లపల్లి చంద్రయ్య, నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన అబ్దుల్ రఫీక్ అబ్దుల్ రహీం కుటుంబాలకు రూ.26 లక్షల చొప్పున వారివారి ఇళ్లకు వెళ్లి పరిహారం అందించారు.
కొండగట్టులో సంగీత దర్శకుడు ఆర్పీ పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారిని సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ముఖ్య అర్చక్ లక్ష్మణ ప్రాణదాన ప్రసాద్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అశోక్ పాల్గొన్నారు.
నృసింహుని సన్నిధిలో..
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామివారిని ఆర్పీ కటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం తరఫున స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ముఖ్య అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.
దమ్మన్నపేటలో భూసర్వే
మేడిపల్లి: మండలంలోని దమ్మన్నపేటలో జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో జివాకర్రెడ్డి, భూమి కొలతల ఏడీ కిషన్ ప్రసాద్, తహసీల్దార్ మునిందర్, ఎంపీడీవో అంజూమా పాల్గొన్నారు.


