జగిత్యాల: సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సీజనల్ వ్యాధులపై మున్సిపల్ కమిషనర్లు, వైద్యశాఖ, ఎంపీడీవోలతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా అదుపులో ఉండేలా చూడాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే జ్వరం రాదనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలన్నారు. పాత టైర్లు, కూలర్లు, పూలకుండీలు, ఖాళీ సీసాలు తొలగించాలని పేర్కొన్నారు. ఫాగింగ్ మిషన్స్, ఆయిల్బాల్స్ అందుబాటులో ఉండాలన్నారు. వైద్యశాఖ అధికారులు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీఆర్డీవో రఘువరణ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ పారదర్శకంగా చేపట్టాలి
జగిత్యాలరూరల్: అభివృద్ధి పనులను నాణ్యతగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బీర్పూర్ మండలం చిన్నకొల్వాయి, తాళ్లధర్మారం, తుంగూరు పంచాయతీ భవనాలు, పాఠశాలలోని వంట గదులను పరిశీలించారు. విద్యార్థులకు వసతులు కల్పించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సారంగాపూర్ మండలం నాగపుగూడెంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ నమోదును పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు నమోదయ్యేలా అవగాహన కల్పించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, పీఆర్ ఈఈ లక్ష్మణరావు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేశ్, బీఎల్వోలు పాల్గొన్నారు.


