కోరుట్ల: మీరు చేసే సేవలతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.. అలాంటి మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం.. ఏమైనా సమస్యలు ఉంటే నాతో నేరుగా చెప్పండి.. పరిష్కారానికి కృషిచేస్తాను.. అంటూ కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత–గంగాధర్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిబేట్లో మహిళా పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. కార్మికుల మంచి, చెడు తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి మున్సిపల్ తరఫున అందాల్సినవి అందుతున్నాయో.. లేదో తెలుసుకున్నారు. మహిళా కార్మికులకు మున్సిపల్ తరఫున ప్రతీ మూడు నెలలకోసారి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాత్రి వేళ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరికి ఆఫ్రన్, చీరలు, పార, తట్టలు ఎప్పటికప్పుడు కొత్తవి ఇస్తామన్నారు. ఎవరికై నా ఆఫ్రన్లు, చెప్పులు అందకుంటే తనకు తెలపాలని సూచించారు. స్థానికంగా నయంకాని అనారోగ్య సమస్యలు ఉంటే హైదరాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రి సౌకర్యాలు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. మున్సిపల్లో పనిచేస్తున్న 40 మంది మహిళా కార్మికులకు ఈఎస్ఐ వసతి ఉందని తెలిపారు. ఇటీవల ఓ మహిళా కార్మికురాలికి అక్కడే ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించామన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి
ఈ సందర్భంగా పలువురు మహిళా పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ.. తమకు ఆరోగ్యపరంగా ఏమైనా పెద్ద సమస్యలు వస్తే సాయం చేయాలని కోరారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు, పింఛన్లు ఇప్పించాలని విన్నవించారు. స్పందించిన చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ మహిళా కార్మికులకు ఎలాటి సమస్యలు ఉన్న తనను నేరుగా కలిసి చెప్పుకుంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని వారందరికీ ఇండ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు వర్తించేలా చూస్తామన్నారు. ఊరు బాగు కోసం పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు ఓ మహిళా చైర్పర్సన్గా తనవంతుగా పూర్తి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు.
సాక్షి డిబేట్లో కోరుట్ల చైర్పర్సన్ వసంత
మీకు సమస్యలు ఉంటే నాతో చెప్పవచ్చు
పారిశుధ్య కార్మికులతో మాటముచ్చట


