● సర్వేల పేరిట కాసుల వసూలు ● అభ్యర్థుల్లో ఆందోళన
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ప్రధాన పార్టీలు సర్వేటీంలను నియమించిన విషయం తెల్సిందే. క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల తీరుతెన్నులను పరిశీలించేందుకు పంపించారు. హైదరాబాద్లోని ఏజన్సీల నుంచి సర్వే కోసం వచ్చామని చెప్పి కొంతమంది జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో పర్యటించారు. అభ్యర్థులు అసలే తమకు పార్టీ టికెట్ వస్తుందో..రాదోనని టెన్షన్లో ఉండగా సర్వే టీం మెంబర్లు అభ్యర్థులను కలిసి సర్వే అనుకూలంగా ఇస్తామని, తమను ‘ఎంతోకొంత’ చూసుకోవాలని చెప్పి కాసులు వసూలు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా పార్టీల టికెట్ కోసం పోటీలో ఉన్న అందరి నుంచి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇక్కడితో ఆగకుండా ‘మళ్లీ రెండో సర్వే ఉంది.. మీ పరిస్థితి ఏంటో చెబుతాం.. మీరు ఎలా ప్రచారం చేయాలి.. మీ వార్డులో ఎవరు మీకు అనుకూలంగా ఉన్నారు..? ఎవరు ప్రతికూలంగా ఉన్నారనే విషయాలు తేల్చుతాం..’ అంటూ అభ్యర్థుల సెల్పోన్లకు మెసేజ్లు పెట్టి మరోసారి కాసుల వసూలు దిగడానికి సిద్ధమైనట్లు సమాచారం. అభ్యర్థుల టెన్షన్ను ఆసరాగా చేసుకున్న ఇలాంటి వారు ఎవరికివారు ఇలా సొమ్ము చేసుకుంటున్న తీరు కలవరపెడుతోంది.


