తాగునీటి సమస్యపై డ్రైవ్
కథలాపూర్(వేములవాడ): వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి సుమారు 20 రోజులపాటు మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్శాఖ అధికారులు కలిసి అన్ని గ్రామాల్లో పర్యటించి నీటి సమస్యలను గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 385 గ్రామపంచాయతీలున్నాయి. 113 అనుబంధ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు 892 రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ, వర్షాకాలంలో పైపులైన్ లీకేజీలతో సరిగా నీళ్లు అందని పరిస్థితి. వేసవికాలంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతోపాటు నీటి అవసరాలు ఎక్కువ కావడంతో ప్రజలకు సరిపడేలా నీరందించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. దీంతో వేసవిలో ప్రజలకు ఇబ్బందులు రావద్దని, నివారణ చర్యలకు పంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడనున్నారు. గ్రామాల్లో పర్యటించి ట్యాంకులను పరిశీలించి పైపులైన్ లీకేజీలు, మరమ్మతులు, వేసవిలో నీటి లభ్యత, బోరుబావుల పరిస్థితి, మిషన్ భగీరథ ద్వారా ట్యాంకుల్లోకి నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు సేకరించి నివేదికను తయారు చేస్తారు. నీటి సరఫరా కోసం కొత్త పనులు చేపట్టాల్సి వస్తే నిధులు ఎన్ని అవసరమో ఉన్నతాధికారులకు నివేదిస్తారు.


