తలనీలాల టెండర్కు మోక్షమెన్నడో..?
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు టెండర్ రెండుసార్లు వాయిదా పడి నెలలు గడుస్తున్నా ప్రక్రియ అడుగు ముందుకు పడడం లేదు. ఏడాది క్రితం ఆలయ ఆధ్వర్యంలో పోగు చేసిన తలనీలాలు నిల్వ చేయడంతో ముక్కిపోయి, ధర తగ్గే అవకాశమున్న నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కొండగట్టు అంజన్న ఆలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని తలనీలాలు సమర్పిస్తుంటారు. ఆ తలనీలాల సేకరణకు గతంతో రెండేళ్లకోసారి టెండర్ నిర్వహించేవారు. ప్రస్తుతం ఏడాదికోసారి పిలుస్తున్నారు. దేవాలయం ఆధ్వర్యంలో పోగుచేసిన తలనీలాలకు వేలం నిర్వహించగా.. టెండర్దారులు సిండికేట్ కావడంతో మార్కెట్ ధర కన్నా తక్కువ పలకడంతో ప్రక్రియ వాయిదా వేశారు. మరోసారి టెండర్ పిలవడంలో అధికారులు విఫలం కావడంతో టెండర్ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏటా తలనీలాల టెండర్ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టెండర్దారులు స్థానికులతో సిండికేట్ కావడంతో బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకు కోట్ చేస్తుండడంతో తాజాగా హైదరాబాద్ కమిషన్ కార్యాలయంలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఇకనైనా ఏడాది కాలంగా పోగు చేసిన తలనీలాలు త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
తలనీలాలు నిల్వతో ధర తగ్గే అవకాశం
తలనీలాలకు బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ.12 వేల నుంచి రూ.18 వేలు పలుకుతోంది. ఆలయ ఆధ్వర్యంలో సేకరించిన తలనీలాలు ఏడాదికాలంగా నిల్వ ఉండడంతో ముక్కిపోయి, నాణ్యత తగ్గి, వేలంలో మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొననుంది. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే పోగు చేసిన తలనీలాలకు టెండర్ ప్రక్రియ వేగవంతం చేసి, ఆలయ ఆదాయానికి గండిపడకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామికి భక్తులు సమర్పించిన తలనీలాల కోసం గతంలో రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ వాయిదా పడ్డాయి. టెండర్ నిర్వహణ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. అధికారుల ఆదేశాలు మేరకు త్వరలోనే టెండర్ పూర్తి చేస్తాం.
– శ్రీకాంత్రావు, కొండగట్టు ఆలయ ఈఓ
రెండుసార్లు ప్రక్రియ వాయిదా
ఏడాదికాలంగా తలనీలాల నిల్వ
నాణ్యత తగిపోయే అవకాశం


