ఇంటర్లో డిజిటల్ పాఠాలు
కథలాపూర్(వేములవాడ): ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్పీ) బోర్డుల ద్వారా ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించనున్నారు. పేద విద్యార్థులు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ చాటేలా ఇంటర్మీడియట్ విద్యాశాఖ శ్రీఫిజిక్స్ వాలాశ్రీతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సైన్స్, గణితం సబ్జెక్టులపై డిజిటల్ పాఠాల బోధనను అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత పాఠశాలల్లో మూడు చొప్పున ఐఎఫ్పీ బోర్డులు ఉండటంతో వాటిని విద్యార్థులకు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇవి లేక విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీన్ని గ్రహించిన ఇంటర్బోర్డు.. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగు చొప్పున ఐఎఫ్పీ బోర్డులను సరఫరా చేసింది. వీటిని కళాశాలల్లో బిగించే పనులు కొనసాగుతున్నాయి. కొన్నిరోజుల్లోనే ఐఎఫ్పీ బోర్డుల ద్వారా పాఠాలు బోధించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
విద్యార్థులకు ప్రయోజనాలెన్నో..
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో ఫస్టియర్, సెకండీయర్లో 5,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోపాటు డిజిటల్ రూపంలో స్క్రీన్పై చూపిస్తూ బోధిస్తే విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, పాఠం కూడా విద్యార్థులకు త్వరగా అవగతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది నుంచే నీట్, ఎప్సెట్, ఇతర పోటీ పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఇంటర్ బోర్డు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వీరికి అనుభవజ్ఞులైన లెక్చరర్లతో వీడియో పాఠాలు బోధించే అవకాశం కలుగుతుంది. ఇవి రెండు రకాలుగా ఉపయోగపడుతాయి. ప్రత్యేక పెన్తో ప్యానెల్ బోర్డుపై రాసే అవకాశం ఉండగా.. స్క్రీన్పై చూపిస్తూ బోధన చేయవచ్చు.


