పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయాలి
కథలాపూర్(కోరుట్ల): చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గంభీర్పూర్ జెడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి నోట్బుక్కులు పరిశీలించి విద్యార్థులతో పాఠాలు చదివించారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలను పరిశీలించి విద్యార్థులతో కాసేపు షటిల్ ఆడి ఉత్సాహపరిచారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జివాకర్రెడ్డి, డీఈవో రాము, తహసీల్దార్ వినోద్, ఎంఈవో శ్రీనివాస్, సర్పంచ్ మనోహర్, హెచ్ఎం సుధాకర్రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి ఉన్నారు.
వందశాతం గ్రౌండింగ్ చేయాలి
జగిత్యాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను మార్చి 31 వరకు వందశాతం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్క్ అవుట్ చేయని ఇందిరమ్మ ఇళ్లు పట్టణ, రూరల్ప్రాంతాల్లో కలిపి మొత్తం జిల్లాలో 11,079 పెండింగ్లో ఉన్నాయని, మార్చి 31 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. బేస్మెంట్పనులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. మరో విడత మంజూరు కానున్న నేపథ్యంలో గతంలోనివి పూర్తిచేసేలా చూడాలన్నారు. అలాగే లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు.


