కాంగ్రెస్ జెండా మోసినోళ్లకే టికెట్లు, బీ ఫాంలు
బీ ఫాం ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు..? ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి సుద్దులు చెప్పడమా.. ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ బీ ఫాంలు ఇవ్వడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎవరని, అభివృద్ధి, సంక్షేమం కోసం సహకరిస్తామంటే ఆహ్వానిస్తామని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానంటే సహించేది లేదని మాజీమంత్రి జీవన్రెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ఎల్ఎల్ గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే సంజయ్ రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు టికెట్ కోసం దరఖాస్తులంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీ ఫాం ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో సీఎంను కలవడం సహజమని, తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎంను కలిశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల హక్కులను కాపాడటం తన బాధ్యత అని, పదేళ్లపాటు పార్టీ జెండా మోసినోల్లకే టికెట్ దక్కేలా చూస్తానని భరోసా ఇచ్చారు. తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదని, ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్టక్షన్ కంపెనీకి సింగిల్ టెండర్తో పనులు ఇవ్వడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. రెండేళ్లు గడుస్తున్నా సమీకృత మార్కెట్ను పూర్తి చేయకపోవడమేనా అభివృద్ధి అంటే అని నిలదీశారు. యావర్రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటున్నదే ఎమ్మెల్యే అని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని స్థానాలూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, బింగి రవి, ధర రమేశ్, గుంటి జగదీశ్వర్, మహ్మద్ భారీ, బొల్లి శేఖర్, నక్క జీవన్, రియాజ్ పాల్గొన్నారు.


