
రోగులు ఫుల్.. బెడ్లు నిల్..
రాయికల్: రాయికల్ పట్టణంలో చాలామంది వైరల్ వ్యాధుల బారిన పడుతున్నారు. వారంతా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం క్యూ కడుతున్నారు. జ్వర పీడితుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో ఉన్న 30 బెడ్లు సరిపోవడం లేదు. ఫలి తంగా వైద్యం కోసం వచ్చిన రోగులకు మందుగోళీ లు ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరో గ్య పరిస్థితి విషమంగా ఉంటేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. కానీ.. బెడ్ల కొరతతో రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పట్టణంతోపాటు మండలంలోని 32 గ్రామాల ప్రజలు వస్తుంటారు. వారికి వైద్యసేవలు అందించేందుకు బల్దియా పరిధిలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే వారంరోజులుగా వాతావరణంలో మార్పులతో జలుబు, దగ్గుతో పెద్దలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్నారు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజు 180 నుంచి 200 మంది ఔట్పేషెంట్లు వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి వైద్యులు చేస్తున్న వైద్య పరీక్షల్లో చిన్నారులే ఎక్కువగా వైరల్ ఫీవర్ బారిన పడుతున్నట్లు నిర్ధారిస్తున్నారు. వచ్చిన ప్రతి రోగికీ సీబీపీ, డెంగీ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో కొంతవరకు ఇబ్బందిగా ఉన్న రోగులను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. వారికి మూడురోజులపాటు అన్ని రకాల వైద్య సేవలు అందించడంతోపాటు, రక్త పరీక్షలు, భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
ఆస్పత్రిలో బెడ్ల కొరత
ఆస్పత్రిలో కేవలం 30 బెడ్స్ మాత్రమే ఉండటంతో చిన్నారులకు 20 బెడ్లు, ఐదు బెడ్లు పెద్దలకు, డెలివరీకి నాలుగు బెడ్స్ వినియోగిస్తున్నారు. ఆస్పత్రిలో బెడ్స్ కొరత తీవ్రంగా ఉండటంతో ఉన్న రోగులకు మాత్రం మూడు రోజుల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో తాగునీటి కొరత కూడా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య పెంచి నిరుపేదలకు వైద్యసేవలందించాలని ప్రజలు కోరుతున్నారు.

రోగులు ఫుల్.. బెడ్లు నిల్..