
ధాన్యం కొనుగోలులో గోల్మాల్
● 436 బస్తాలకు చీటీ రాసిచ్చి.. 421 అంటూ బుకాయింపు
మల్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసి.. లెక్కించి.. నిర్ధారించిన తర్వాత ధాన్యం బస్తాలు గోల్మాల్ అయిన సంఘటన మండలంలోని సర్వాపూర్లో చోటుచేసుకుంది. సర్వాపూర్కు చెందిన రైతు కానుగట్టి మల్లేశం ఇటీల కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఈనెల 24న ధాన్యం తూకం వేశారు. నిర్వాహకులు ధాన్యం బస్తాలను లెక్కించి 436 బస్తాలుగా నిర్ధారించారు. క్వింటాల్కు రూ.40చొప్పున 174.40 క్వింటాళ్లకు హమాలీ చార్జీలు రూ.6,976 చెల్లించాడు. ఈనెల 25న తూకం వేసిన ధాన్యాన్ని లారీలో తరలిస్తుండగా.. 421 బస్తాలేనంటూ రైతుకు సమాచారం ఇచ్చారు. దీంతో తనకు రాసిచ్చిన చీటీ చూపించగా.. తప్పుగా లెక్కించామంటూ బుకాయిస్తున్నారని రైతు మల్లేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తూకం వేసి, లెక్కించి, చీటీ రాసిచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో 421 బస్తాలు నమోదు చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బస్తాల్లో గోల్మాల్పై జిల్లా అధికారులు విచారణ చేపట్టి, తనకు న్యాయం చేయాలని రైతు మల్లేశం వేడుకుంటున్నాడు.