కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ధర్మపురి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం, నర్సయ్యపల్లె గ్రామంలో సర్పంచ్ నేరెల్ల లావణ్య ఆధ్వర్యంలో మంగళవారం కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. పేదల కోసం ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందన్నారు. కంటి సంబంధిత ఏ సమస్య ఉన్నా వైద్యులు గుర్తించి కళ్లద్దాలు అందిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి పాల్గొన్నారు.
బాలసాహిత్యంతోనే పఠన నైపుణ్యం
జగిత్యాల: బాలసాహిత్యంతోనే పఠన నైపుణ్యం పెంపొందుతుందని సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్ అన్నారు. ఎంపిక చేసిన 78 పాఠశాలల ఉపాధ్యాయులకు గ్రంథాలయ పుస్తకాల నిర్వహణ, ఆవశ్యకతలపై మంగళవారం జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. రాజేశ్ మాట్లాడుతూ, పిల్లల్లో భాషాభివృద్ధికి, పఠానాసక్తి పెంపొందించేందుకు పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. బాలసాహిత్యంలో పాఠశాలల్లో అందుబాటులో ఉండేలా 259 పుస్తకాల చొప్పున జిల్లాలోని 153 పాఠశాలల్లో గ్రంథాలయ పుస్తకాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రెయినర్లు మహేశ్, అభయ్రాజ్ పాల్గొన్నారు.