మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి

Trump Campaign woos Indian Americans With Howdy Modi Namaste Trump - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా మరోసారి గెలిచేందుకు ట్రంప్‌ వర్గం బాగానే కసరత్తులు చేస్తుంది. తాజాగా శనివారం అమెరికాలో ఉన్న భారతీయుల ఓట్లను లక్ష్యం చేసుకొని భారీ ర్యాలీ చేపట్టారు. మరో నాలుగేళ్లు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయనను గెలిపించాలంటూ ట్రంప్‌ వర్గం ర్యాలీ తీశారు. దీనికోసం భారత ప్రధాని అమెరికాలో పర్యటించిన హౌడీ మోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నమస్తే ట్రంప్‌కు సంబంధించిన ఈవెంట్స్‌, ఫోటోలను ప్రదర్శించారు. దీంతో పాటు ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఒక వీడియో క్లిప్‌ను కూడా రూపొందించారు.(చదవండి : ట్రంప్‌ నిజంగా మూర్ఖుడు.. అబద్దాల కోరు)

ట్రంప్‌ అధికార ఫైనాన్స్‌ కమిటీ మెండర్‌ కింబర్లీ గిల్‌ఫోయల్.. హౌడీ మోదీ.. నమస్తే ట్రంప్‌ వీడియోలను మిక్స్‌ చేసి తన ట్విటర్‌లో విడుదల చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ... భారత్‌తో సత్ససంబంధాలపై అమెరికా ఎంజాయ్‌ చేస్తుందని.. అమెరికన్‌ భారతీయుల నుంచి ట్రంప్‌ వర్గానికి మంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. భారతీయ అమెరికన్లు ఇంకో 4ఏళ్లు ట్రంప్‌నే అధ్యక్షుడిగా కోరుకుంటున్నారంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు వీరు రిలీజ్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీ వ్యాఖ్యలతో వీడియో ప్రారంభమవుతుంది.

'ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. మీ కుటుంబాన్ని 2017లో నాకు పరిచయం చేశారు.. ఆడియెన్స్‌ వైపు తిరిగి.. ఇప్పుడు నేను మిమ్మల్ని మా కుటుంబానికి పరిచయం చేయడం గౌరవప్రదంగా భావిస్తున్నా అంటూ మోదీ ఉద్వేగంగా పేర్కొంటారు. తర్వాత క్లిప్‌ నేరుగా అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి షిఫ్ట్‌ అవుతుంది. అధ్యక్షుడి హోదాలో మొదటిసారి అడుగుపెట్టిన ట్రంప్‌ క్లిప్‌తో పాటు.. మోడీ, ట్రంప్‌లు ఒకరిని ఒకరు హగ్‌ చేసుకోవడం..  అమెరికన్‌ ఫస్ట్‌ లేడి మెలానియా ట్రంప్‌తో కలిసి డొనాల్డ్‌ ట్రంప్‌, మోదీలు లక్షలాది జనాలకు చేతులు ఊపడం.. అమెరికా భారత్‌ను ప్రేమిస్తూనే ఉంటుంది.. భారత్‌ను ఎప్పుడు అమెరికా గౌరవిస్తూనే ఉంటుంది.. భారత్‌తో మంచి సంబంధాలను ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటుంది.. అంటూ' ట్రంప్‌ ప్రసంగంతో వీడియో ముగుస్తుంది. (చదవండి : అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్)

అయితే ట్రంప్‌ వర్గం అమెరికాలో ఉన్న 1.2 మిలియన్‌ అమెరికన్‌ భారతీయుల ఓట్లను  లక్ష్యంగా చేసుకొని ఈ వీడియోను రూపొందించింది. కాగా సోమవారం రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్‌ వేయనున్నట్లు ట్రంప్‌ అధికార వర్గం ఒక ప్రకటనలో వెల్లడించింది. మైక్‌ పెన్స్‌ను ఉపాధ్యక్షుడిగా నామినేషన్‌ వేయనున్నారు. ఇప్పటికే డొమోక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా  నామినేషన్‌ వేసిన జో బైడెన్‌ తన ప్రచారం వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న భారతీయ అమెరికన్ల ఓట్లను ఆకర్షించడానికి ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్‌ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్‌ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్‌ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్‌లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top