
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది.
హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.
వీసాలు నిషేధించిన దేశాలివే..
1. భారత్
2. బంగ్లాదేశ్
3. పాకిస్తాన్
4. అల్జీరియా
5. ఈజిప్ట్
6. ఇథియోపియా
7. ఇండోనేషియా
8. ఇరాక్
9. జోర్డాన్
10. మొరాకో
11. నైజీరియా
12. సుడాన్
13. ట్యూనిషియా
14. యెమెన్
నిషేధం వెనుక కారణాలివే..
సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా