కశ్మీర్‌లో మొబైల్‌ నెట్‌వర్క్‌ పటిష్టానికి పాక్‌ వ్యూహం | Pakistan Readies To Built New Mobile Towers In Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో కమ్యూనికేషన్ల వ్యవస్థ పటిష్టానికి పాక్‌ వ్యూహం

Oct 19 2020 3:27 PM | Updated on Oct 19 2020 4:44 PM

Pakistan Readies To Built New Mobile Towers In Kashmir - Sakshi

ఇస్లామాబాద్‌ /న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో తన మొబైల్‌ కవరేజ్‌ను విస్తరించేందుకు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ ప్రభుత్వం సన్నద్ధమైంది. కశ్మీర్‌లోకి చొరబడే పాక్‌ ఉగ్రవాదులకు ఇది ఉపకరించడంతో  పాటు భారత ప్రభుత్వం భవిష్యత్‌లో కమ్యూనికేషన్ల వ్యవస్థను బ్లాక్‌ చేసినా ఎలాంటి ప్రభావం లేకుండా ఉండేలా పాక్‌ తన వ్యూహానికి పదును పెడుతోంది. కశ్మీర్‌లోకి చొరబడే ఉగ్రవాదులకు సాయం చేసేలా మొబైల్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు పాకిస్తాన్‌ పనిచేస్తోందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.

భారత భద్రతా దళాలు బ్లాక్‌ చేయలేని పాకిస్తాన్‌ టెలికాం సేవలను కశ్మీరీలు వాడుకోవాలని పాక్‌ కోరుకుంటోందని ఆ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు గత ఏడాది భారత ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌లో కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఆందోళనకారులు వదంతులు ప్రచారం చేయకుండా కేంద్రం ఈ నియంత్రణలను చేపట్టింది. పీఓకేతో పాటు గిల్గిట్‌-బాల్టిస్తన్‌ ప్రాంతంలో టెలికాం సేవలను అందించాలని ప్రభుత్వ రంగ స్సెషల్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ (ఎస్‌సీఓ)ను పాకిస్తాన్‌ కోరినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయని ఓ జాతీయ వెబ్‌సైట్‌ పేర్కొంది. చదవండి : ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లోనే పాక్‌!

జమ్ము కశ్మీర్‌లో కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే ప్రణాళికను పాక్‌ ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తోందని సీనియర్‌ అధికారులు వెల్లడించారు. పీఓకేలో భారత స్ధావరాలకు సమీపంలోని ఎస్‌సీఓ మొబైల్‌ టవర్స్‌లో సిగ్నల్‌ శక్తిని పెంచాలని పాక్‌ ఐఎస్‌ఐ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement