జపాన్‌లో మసీదు.. పాక్‌ పరువు పాయె! | Pakistan build mosque illegally in Japan Later This Happend | Sakshi
Sakshi News home page

జపాన్‌లో మసీదు.. పాక్‌ పరువు పాయె!

Jun 3 2026 7:09 AM | Updated on Jun 3 2026 8:34 AM

Pakistan build mosque illegally in Japan Later This Happend

పరాయి దేశంలో పాకిస్థాన్‌కు పరువు పొగొట్టుకుంది. ఆ దేశ పౌరులు అక్కడ ఓ మసీదును నిర్మించడమే అందుకు కారణం. పైగా దానిని ఆ దేశ రాయబారితోనే అట్టహాసంగా ప్రారంభించింది. అయితే వారం తిరగకుండానే స్థానిక అధికారులు మసీదు నిర్వాహకులకు షాకిచ్చారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

జపాన్‌లోని సైతామా ప్రిఫెక్చర్‌లో ఉన్న కవగోయే నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదాస్పదంగా మారింది. నగర ప్రణాళిక చట్టాల ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాని ప్రాంతంలో ఈ మసీదును నిర్మించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సుమారు 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం పర్వత అటవీ భూమిగా నమోదై ఉంది. ఇది అర్బనైజేషన్‌ కంట్రోల్‌ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం నిషేధం.

అయితే మసీదు నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోలేదని కవగోయే మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేశారు. వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం పాకిస్థాన్‌ రాయబారి అబ్దుల్‌ హమీద్‌ Abdul Hameed ఈ ఏప్రిల్‌లో జరిగిన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడమే. దీంతో ఈ నిర్మాణానికి పాకిస్థాన్‌ ప్రభుత్వ మద్దతు ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

అయితే వివాదం ముదరడంతో పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. మసీదు నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకున్నామని హామీ ఇవ్వడంతోనే రాయబారి కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంది. స్థానిక చట్టాలను ఉల్లంఘించే ఏ ప్రాజెక్టుతోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే జపాన్‌లో నివసిస్తున్న పాకిస్థానీ కమ్యూనిటీకి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, ప్రార్థనా మందిరాల నిర్మాణం సహా అన్ని అంశాల్లో స్థానిక చట్టాలను పూర్తిగా పాటించాలని కోరింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని హెచ్చరించింది.

ఇదే సమయంలో జపాన్‌లో చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాషియో మసీదు ప్రతినిధి షకీల్‌ షేక్‌ మహ్మద్‌ కూడా ఈ నిర్మాణాన్ని తప్పుబట్టారు. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని మాత్రమే మసీదులు నిర్మించాలని సూచించారు.

మొత్తంగా మసీదు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కొద్ది రోజులకే అది అక్రమ నిర్మాణంగా మారడం పాకిస్థాన్‌కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. జపాన్‌ వంటి చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించే దేశంలో ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement