ఆంగ్‌సాన్‌ సూకీకి భారీ షాక్‌.. ఎన్‌ఎల్‌డీ పార్టీ గుర్తింపు రద్దు

Myanmar Military Govt Dissolved Aung San Suu Kyi NLD Party - Sakshi

మయన్మార్‌ జుంటా గవర్నమెంట్‌ (మిలిటరీ ప్రభుత్వం) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ ప్రభుత్వ పర్యవేక్షణలోని ఎన్నిక సంఘం ప్రతిపక్ష నేత ఆంగ్‌ సాన్‌ సూకీకి భారీ షాక్‌ ఇచ్చింది. సూకీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’(NLD) పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మయన్మార్‌ ఈసీ. కొత్త సైనిక-ముసాయిదా ఎన్నికల చట్టానికి అనుగుణంగా.. ఎన్‌ఎల్‌డీ పార్టీ తన రిజిస్ట్రేషన్‌ను తిరిగి నమోదు చేసుకోవడంలో విఫలమైందని, అందుకే గుర్తింపు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

మయన్మార్‌లో కఠిన ఎన్నికల చట్టం తీసుకొచ్చింది జుంటా మిలిటరీ ప్రభుత్వం. దాని ప్రకారం.. కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు, అజ్ఞాతంలో ఉన్నవాళ్లు, ఇంకా పలు నిబంధంనల కింద..  రాజకీయ పార్టీలను అధికారికంగా నమోదు చేయడానికి వీల్లేదు. తద్వారా ప్రత్యర్థి పార్టీల అడ్డుతొలగించుకునేందుకు మిలిటరీ ప్రభుత్వం ప్లాన్‌ వేసింది. ఈ క్రమంలో..  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నప్పటికీ, విపక్షాల నుంచి విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఇందుకోసం ఈ ఏడాది జనవరి నుంచి పార్టీల రీ రిజిస్ట్రేషన్లకు రెండు నెలల గడువు ఇచ్చింది. ఆ దేశంలోని మొత్తం 90 పార్టీలకుగానూ 50 పార్టీలు మాత్రమే  రీ రిజిస్ట్రేషన్‌ ద్వారా అర్హత సాధించుకున్నాయి. ఇక మిగతా పార్టీల గుర్తింపు(సూకీ ఎన్‌ఎల్‌డీ సహా) బుధవారం(నేటి) నుంచి రద్దు కానున్నాయి. 

మయన్మార్‌ ఉద్యమ నేత అయిన ఆంగ్‌ సాన్‌ సూకీ 1988లో ఎన్‌ఎల్‌డీని స్థాపించారు.  1990 ఎన్నికలలో ఘనవిజయం సాధించగా.. అప్పటి జుంటా(మిలిటరీ) ఆ ఎన్నికను రద్దు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె మిలిటరీ భాగస్వామ్య పార్టీలను మట్టికరిపించి కూటమి పార్టీల సాయంతో ఘన విజయం సాధించారు.

ఇదిలా ఉంటే.. 2020లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ ఘన విజయం సాధించింది. కానీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో జుంటా మిలిటరీ నేతలు తిరుగుబాటుకి దిగారు. ఆపై సూకీని జైలు పాలు చేయడంతో పాటు పలు నేరాల కింద ఆమెకు శిక్షలు విధిస్తూ వెళ్తున్నారు. వివిధ కేసుల్లో ప‌డిన జైలుశిక్ష ఇప్పటిదాకా మొత్తం 33 ఏళ్ల‌కు చేరుకుంది.

ఒకవైపు ఆమెపై కేసులు, వాటి విచారణ పరంపర కొనసాగుతోంది. అందులో అవినీతి, రహస్య సమాచార లీకేజీ తదితర ఆరోపణలు ఉండడం గమనార్హం. మరోవైపు మిలిటరీ నేతల పాలనలో మయన్మార్‌ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంకోవైపు సూకీని రిలీజ్ చేయాల‌ని ఇటీవ‌ల యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top