Modi-Operation Ganga: ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!
IAF C-17 Aircraft Bring back Indian Nationals: చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యలు మరింత వేగవంతం చేసింది. అంతేకాదు రష్యా నేరుగా జనావాసాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధం మరింత తీవ్రమవుతోందంటూ ఉక్రెయిన్లోని రాయబార కార్యాలయం విద్యార్థులను తక్షణమే కైవ్ని విడిచి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల తరలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా ఆపరేషన్ గంగా చేపట్టాలని నిర్ణయించారు.
ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఐఏఎఫ్ సీ-17 విమానం సుమారు 336 మందిని తీసుకువెళ్లగలదు. అంతేకాదు దీన్ని అఫ్గనిస్తాన్ తరలింపులో ఉపయోగించారు. మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో ఇది సహయపడుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ భారత వైమానిక దళం ఈ రోజు నుంచే ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 విమానాలు మోహరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని చెప్పారని అన్నారు.
ఇంకోవైపు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజా సలహాను జారీ చేసింది. కైవ్ను అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. మరోవైపు భారత్ ఆపరేషన్ గంగా కింద తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ సరిహద్దుల వద్ద మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు.
(చదవండి: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం)