రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్‌

Mike Pence has accepted the Republican vice-presidential candidate - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున మైక్‌ పెన్స్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్‌ మాట్లాడుతూ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్‌ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్‌ చైనాకి చీర్‌ లీడర్‌ అయిన ఆయన లెఫ్ట్‌ పార్టీతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు.

శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్‌ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బైడెన్‌ అధికారంలోకి వస్తే చైనా కంపెనీలపై విధించిన సుంకాలన్నీ రద్దు చేయాలని చూస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణాలు రద్దు చేసిన ట్రంప్‌ సర్కార్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం పద్ధతి’’అంటూ పెన్స్‌ విరుచుకుపడ్డారు. బైడన్‌ నాయకత్వంలో అమెరికన్లు సురక్షితం కాదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ ఆకస్మికంగా హాజరై పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్య పరిచారు.

మరోవైపు భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌ తన తల్లి శ్యామల గోపాలన్‌ 19 ఏళ్ల వయసులోనే భారత్‌ నుంచి అమెరికాకు వచ్చారని చిన్నతనం నుంచి సమానత్వ సాధన గురించి తనకు పాఠాలు బోధించారని చెప్పారు. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలా హ్యారిస్‌ చిన్న వీడియో రూపంలో తన సందేశాన్ని ఇచ్చారు. తన తాతతో కలిసి చెన్నై వీధుల్లో ఉదయం వేళల్లో నడుచుకుంటూ తన తల్లి మహిళా సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల గురించి తెలుసుకున్నారని, ఆమే తనకు  స్ఫూర్తి అని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top