
అబుజా: ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పడవలో వ్యాపారులు
నేషనల్ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ (ఎన్ఐడబ్ల్యూఏ)ప్రతినిధి మకామా సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్కు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ తెలిపారు. ప్రయాణికులెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కారణంగానే ప్రాణనష్టం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
తరచూ ప్రమాదాలు
ఘటనా స్థలంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. బోటులో ఎక్కువగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బోటులో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు తదితర అంశాలు ఇటువంటి ఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు