మంచిర్యాల జిల్లా: చదువు ఇష్టం లేక ఓ విద్యార్థిని కాలేజీ నుంచి అదృశ్యమైంది. ఎక్కడికి వెళ్లిందోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసును ఛేదించేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. చివరికి కరీంనగర్లో పోలీసులకు చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉచిత బస్సులో మూడు రోజులు చక్కర్లు కొట్టినట్లు తెలుసుకుని అవాక్కయ్యారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నుంచి ఈ నెల 5న తెల్లవారుజామున ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోటపల్లి నుంచి మోటార్సైకిల్పై లిఫ్ట్ అడిగి వెళ్లినట్లు గుర్తించారు.
అనంతరం ఆధార్ కార్డుతో ఆర్టీసీ బస్సులో చెన్నూర్ నుంచి మంచిర్యాల, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్, అక్కడి నుంచి మళ్లీ మంచిర్యాలకు వచ్చి కరీంనగర్కు వెళ్లింది. అక్కడి నుంచి బుధవారం హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యార్థిని గుర్తించారు. మిస్టరీని ఛేదించిన ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, సిబ్బంది జగదీశ్రెడ్డిని ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణ అభినందించారు.


