
జపాన్ జైళ్లలో దుర్భర పరిస్థితులు
దశాబ్దాలుగా మారని చట్టాలు ∙‘హకామడ’ ఉదంతంతో మళ్లీ తెరపైకి
ఇవావో హకామడ. ఇటీవల అంతర్జాతీయంగా మారుమోగిన కేసు. జపాన్లో శిక్షల తీవ్రత, అక్కడి నేర న్యాయవ్యవస్థ గురించి మరోసారి చర్చకు తెరతీసిన కేసు. 89 ఏళ్ల హకామడ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్. తను పనిచేసే సంస్థ యజమానిని, అతడి కుటుంబాన్ని హత్య చేశాడన్న ఆరోపణలపై 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.
దాని అమలును పెండింగ్లో పెట్టడంతో ఏకంగా 50 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపాడు! ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జైలు జీవితం గడిపిన మరణశిక్ష ఖైదీగా రికార్డులకెక్కాడు. అయితే, పోలీసుల చిత్రహింసలకు తట్టుకోలేకే చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చిందని హకామడ ఇటీవల వాపోయాడు. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారైనట్టు షిజుయోకా జిల్లా కోర్టు కూడా 2024 మార్చిలో అనుమానం వ్యక్తం చేసింది. పునర్విచారణకు ఆదేశిస్తూ హకామడను విడుదల చేసింది. అనంతరం 2024 సెప్టెంబర్ 26న అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
అర్ధశతాబ్దానికి పైగా అక్రమంగా నిర్బంధించినందుకు 21.7 కోట్ల యెన్లు (సుమారు రూ.12.5 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జపాన్లో అత్యధిక క్రిమినల్ నష్టపరిహారంగా ఇది రికార్డు సృష్టించింది. దీని వెనక హకామడ సోదరి హిడెకో దశాబ్దాల పోరాటం దాగుంది. లాయర్లను కలవడం, పిటిషన్లు వేయడం, ప్రజా మద్దతు కూడగట్టడం... ఇలా ఆమె చేయని ప్రయత్నం లేదు. కానీ సోదరుడు ఎట్టకేలకు విడుదలయ్యాడన్న ఆనందం కూడా ఆమెకు మిగల్లేదు. 55 ఏళ్ల ఒంటరి నిర్బంధం హకామడ మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీయడమే అందుకు కారణం. జపాన్ జైళ్లలో ఖైదీల దుస్థితికి ఇది తాజా తార్కాణంగా నిలిచింది.
రాత్రంతా రోదనే!
జపాన్ జైళ్లలో అత్యంత కఠిన నిబంధనలు అమలవుతాయి. పలు నేరాలకు ఒంటరి నిర్బంధాన్ని శిక్షగా అమలు చేస్తారు. తోటి ఖైదీలతో మాట్లాడటం దేవుడెరుగు, తమలో తాము కూడా గట్టిగా మాట్లాడుకునేందుకు అనుమతి ఉండదు! పైగా వారిని కలిసేందుకు కుటుంబీకులు, లాయర్లను తప్ప స్నేహితులతో పాటు ఎవరినీ అనుమతించరు. ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్తిగా సెన్సార్ చేస్తారు. వ్యక్తిగత వస్తువులను అత్యంత పరిమితంగా అనుమతిస్తారు. కూర్చోవడం, నడవడం, మాట్లాడటం, తినడం, నిద్రపోవవడం అన్నీ పక్కాగా టైం ప్రకారం చేయాల్సిందే. ఒక్క సెకను అటూ ఇటూ అయినా శిక్ష తప్పదు.
అతి శీతల వాతావరణంలో కూడా టోపీలు, గ్లవ్స్ ధరించడానికి వీల్లేదు. అధికారులపై ఫిర్యాదుకు, సంఘటితం కావడానికి హక్కుండదు. ఏ నిబంధనను కాస్త ఉల్లంఘించినా గార్డుల చేతిలో చావుదెబ్బలే! గంటల తరబడి మోకాళ్లపై కూర్చోబెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖైదీలు తీవ్రంగా కుంగిపోతుంటారు. అయితే ఏడ్వడంపై ఆంక్షలు లేవు. దాంతో చాలామంది ఖైదీలు రాత్రిళ్లు ఏడుస్తుంటారు. ఖైదీలను ఇలా ఏళ్లపాటు ఒంటరిగా నిర్బంధించడంపై హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ వంటి మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా జపాన్ న్యాయవ్యవస్థలో దశాబ్దాలుగా ఎలాంటి సంస్కరణలు జరగలేదు.
శిక్షలు అత్యంత కఠినం
జపాన్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న నేరాలకు కూడా జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తారు. కొద్ది మోతాదులో డ్రగ్స్ దొరికినా, వాడినా ఏడాది నుంచి పదేళ్ల జైలు, 50 లక్షల యెన్ల జరిమానా విధించవచ్చు. క్రిమినల్ కేసులు రుజువయ్యే రేటు ఏకం 99 శాతం! బలమైన సాక్ష్యాలుండి, గెలుస్తామని నమ్మిన కేసులనే ప్రాసిక్యూటర్లు దాఖలు చేస్తారు. చాలా కేసుల్లో విచారణకు ముందే నిందితులు నేరం అంగీకరిస్తారు. కనుక జపాన్లో ఒకసారి అభియోగాలు నమోదైతే ఇక నిర్దోషిగా బయటపడటం అసాధ్యమేనన్న విమర్శలూ ఉన్నాయి.
నేరాలు చాలా తక్కువ
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా జపాన్కు పేరుంది. సమర్థ నేర న్యాయవ్యవస్థ దాని సొంతం. 2023లో అక్కడ నమోదైన మొత్తం నేరాలు కేవలం 7 లక్షలు. వాటిలో అత్యధికం దొంగతనాలే. అరెస్టు తర్వాత అనుమానితులను 48 గంటల దాకా అదుపులో ఉంచుకునే అధికారం పోలీసు లకు ఉంది. తర్వాత కేసును ప్రాసిక్యూటర్కు అప్పగిస్తారు, వారు 24 గంటల్లోపు నిందితుడిని విచారించి తదుపరి నిర్బంధానికి న్యాయమూర్తి అనుమతి పొందాలి. అలా 23 రోజుల దాకా నిర్బంధించొచ్చు. ఈ విధానంపై అనేక విమర్శలున్నాయి.
జైలు గోడలు బద్దలైనా... ఒక్కరూ పారిపోలేదు!
జైళ్లలో తీవ్ర నిర్బంధ పరిస్థితులున్నా పారిపోయేందుకు మాత్రం ఖైదీలు కల్లో కూడా సాహసించరు! దొరికితే శిక్షల తీవ్రత రెట్టింపవుతుంది మరి! పైగా జపాన్లో తప్పించుకుని ఎంతోకాలం తిరగడం అసాధ్యం. 1923 సెప్టెంబర్ 1న తీవ్ర భూకంపానికి యొకోహామాలో జైలు గోడ కూలింది. ఆ సమయంలో జైల్లో 1,100 మంది ఖైదీలున్నా కనీసం ఒక్కరు కూడా పారిపోలేదు. కూలిన గోడల లోపలే గడిపారు. దాంతో ముచ్చటపడ్డ జైలు డైరెక్టర్ ఖైదీలను ఒక రోజంతా బయటి తిరిగొచ్చేందుకు అనుమతించారు. 24 గంటలు పూర్తవుతూనే ప్రతి ఖైదీ టంచనుగా తిరిగొచ్చాడు!