పాకిస్తాన్‌కు కొత్త టెన్షన్‌.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్‌ | Israel Reuven Azar says Pak lacks trust needed for Iran war mediation | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు కొత్త టెన్షన్‌.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్‌

Jun 5 2026 1:50 PM | Updated on Jun 5 2026 2:00 PM

Israel Reuven Azar says Pak lacks trust needed for Iran war mediation

ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం పాత్రను ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రశ్నిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

"ఇజ్రాయెల్ దృష్టిలో పాకిస్థాన్ విశ్వసనీయ మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వం చేసే దేశం అన్ని పక్షాల విశ్వాసాన్ని పొందాలి. పాకిస్థాన్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు" అంటూ రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు సంబంధించిన సున్నితమైన అంశాల్లో పాకిస్థాన్ పాత్రపై తమకు సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.అమెరికా లేదా ఇతర దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్‌ను సంప్రదించవచ్చని, అయితే అది ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని మార్చదని అజర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, అలాగే ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌పై ఎందుకు అనుమానాలు?
ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం మధ్యవర్తిగా వ్యవహరించే దేశం తటస్థ వైఖరిని కలిగి ఉండాలి. అయితే పాకిస్థాన్‌కు ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అంతేకాకుండా, గతంలో ఇజ్రాయెల్ విధానాలపై ఇస్లామాబాద్ చేసిన విమర్శలు కూడా ఆ దేశ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అజర్ సూచించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పాకిస్థాన్ పాత్ర పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇస్లామాబాద్ దౌత్య సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..
ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ప్రాంతీయ మిలిటెంట్ సంస్థల కార్యకలాపాలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా అంగీకరించలేమన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు కొత్త దౌత్య చర్చలకు తెరతీశాయి.

భారత్‌పై ప్రశంసలు
ఇదే సందర్భంగా భారత్ పాత్రను కూడా రూవెన్ అజర్ ప్రశంసించారు. పశ్చిమాసియాలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్‌కు కీలక పాత్ర ఉందని, ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

78 ఏళ్లుగా దూరంగానే పాక్–ఇజ్రాయెల్
పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగానే ఉన్నాయి. 1947లో పాకిస్థాన్, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామాబాద్ ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలుస్తూ, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించబోమనే వైఖరిని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా పాలస్తీనా అంశంలో అరబ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ విధానం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక భాగంగా కొనసాగుతోంది. అధికారిక సంబంధాలు లేకపోయినా, గతంలో రెండు దేశాల మధ్య పరోక్ష స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు లేవు. దౌత్య సంబంధాలు కూడా నెలకొనలేదు.

ఇక రూవెన్ అజర్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, ఇరాన్ అంశంలో దాని పాత్ర, అలాగే మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement