
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండు దేశాలు పరస్పర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు.. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దాడుల కారణంగా ఇప్పటికే 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా.. 329 మంది గాయపడ్డారు. ఇక, ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా.. 39 మంది గాయపడినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టెహ్రాన్లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
మరోవైపు.. ఇరాన్ మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది.

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వేళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. గుటెర్రస్ ట్విట్టర్ వేదికగా.. ఇరు దేశాలు ఉద్రిక్తతలను ఆపాలని పిలుపునిచ్చారు. శాంతి, దౌత్య మార్గంలో చర్చలు జరపాలన్నారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.