
దాంతో 10 అణుబాంబులను తయారుచేసే ఛాన్స్
16 ట్రక్కుల్లో తరలించిందా?
బంకర్ బస్టర్ దాడులకు ముందే యురేనియంను తీసుకెళ్లారా?
ఉపగ్రహచిత్రాలతో మొదలైన కొత్త అనుమానాలు
ప్రపంచవ్యాప్తంగా అణుభయాలను పెంచేస్తున్న ఇరాన్
గుట్టుచప్పుడుకాకుండా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులేసి పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని నాశనంచేశానని అమెరికా ఆనందపడేలోపే తాజా ఉపగ్రహ చిత్రాలు కొత్త భయాలను మోసుకొచ్చాయి. దాడులు ఖాయమన్న అంచనాతో ఇరాన్ సైన్యం ముందుగానే ఆ అణుకేంద్రం నుంచి వందల కేజీల అత్యంతశుద్ధమైన యురేనియంను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
ఎంతో కష్టపడి శుద్ధిచేసిన యురేనియంను గాల్లో దీపంలా అలా అణుకేంద్రంలో నిర్లక్ష్యంగా వదిలేసేంత అమాయకత్వం ఇరాన్కు లేదని, ఎంతో తెలివిగా యురేనియం నిల్వలను వేరే చోటుకు తీసుకెళ్లిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు బలంచేకూరేలా అమెరికా వైమానిక దాడులకు ముందే న్యూక్లియర్ సెంటర్కు కొన్ని భారీ ట్రక్కులు వచ్చి వెళ్లినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేం తెలీకుండానే యురేనియంలేని న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా హడావిడిగా బాంబులేసిందని కొందరు చెబుతున్నారు.
పక్కా ప్రణాళికతో..
చిన్నని స్థూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియంను ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలొచ్చాయి. ఈ చిన్న బ్యారెళ్లను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులను తయారుచేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫేల్ మారియానో గ్రస్సీ సైతం ధృవీకరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శాంతిచర్చలకు సిద్ధమైతే, తమ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయని బెదిరించి ఇరాన్ తన డిమాండ్లను సాధించే వీలుంది.
‘‘ చర్చల సమయంలో ఇరాన్ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమ డిమాండ్లు నెరవేరాలని కోరవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఏదేమైనా బాంబులు పేల్చి మేం వాళ్ల యురేనియం శుద్ధి కేంద్రాలను నాశనంచేశాం. ఇప్పట్లో ఇరాన్ మళ్లీ అణుశుద్ధిని మొదలుపెట్టడం అసాధ్యం’’ అని ఏబీసీ వార్తాసంస్థతో జేడీ వాన్స్ చెప్పారు. ఈ అంశంపై రఫేల్ మారియానో సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థలతో మాట్లాడారు. ‘‘ఇందులో దాచాల్సిందేమీ లేదు. అంతా బహిరంగ రహస్యమే.
తమ యురేనియం నిల్వలను కాపాడుకునే దమ్ము తమకు ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ యురేనియంతో అణుబాంబును తయారుచేయడం కుదరదు. కనిపించకుండా పోయిన యురేనియం శుద్ధత కేవలం 60 శాతమే. 90 శాతం శుద్ధత ఉంటేనే అణుబాంబుకు అక్కరకొస్తుంది. దాడులకు ఒక వారం ముందు అణు ఇంధన ఏజెన్సీ పర్యవేక్షణ బృంద సభ్యులు ఇస్ఫహాన్ అణుకేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ యురేనియం నిల్వలను చూశారు’’ అని రఫేల్ వెల్లడించారు.
ఆ 16 ట్రక్కులు ఎక్కడ?
ఫోర్డో భూగర్భ అణుకేంద్రం ముఖద్వారం వద్దకు దాడులకు ముందు 16 పటిష్టమైన ట్రక్కులు వచ్చినట్లు మాక్సార్ టెక్నాలజీస్ సంస్థ వారి ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కుల నిండా ఏవో బ్యారెళ్లను నింపి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ట్రక్కులు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అయితే ట్రక్కులపై అమెరికా నిఘా వర్గాలు ఓ కన్నేశాయని, ట్రంప్ అనుమతి వచ్చాక వాటిపై దాడులుచేసేందుకు అమెరికా సేనలు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాతో మరో కథనం వెలువడింది.