మరింత ఉధృతంగా దాడులు | Iran attacks Israeli spy agency Mossad office: Iran top military commander Ali Shadmani Dead | Sakshi
Sakshi News home page

మరింత ఉధృతంగా దాడులు

Jun 18 2025 1:57 AM | Updated on Jun 18 2025 7:33 AM

Iran attacks Israeli spy agency Mossad office: Iran top military commander Ali Shadmani Dead

ఇరాన్‌ క్షిపణి దాడుల హెచ్చరిక సైరన్‌ మోగడంతో మంగళవారం టెల్‌ అవీవ్‌ సమీపంలో ఓ బంకర్‌లో తలదాచుకున్న ఇజ్రాయెల్‌వాసులు

ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ కార్యాలయంపై ఇరాన్‌ దాడులు

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సీనియర్‌ మిలటరీ కమాండర్‌ షాద్మానీ అంతం

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/దుబాయ్‌: అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఇరాన్‌ సముపార్జించకుండా అడ్డుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్‌ తన దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇరాన్‌ అత్యున్నత నేత, సుప్రీం కమాండర్‌ అయ తొల్లా అలీ ఖమేనీకి సన్నిహితుడు, ఖాటమ్‌ అల్‌ –అన్బియా సెంట్రల్‌ హెడ్‌క్వార్డర్స్‌ సారథి, సైనిక జనరల్‌ అలీ షాద్మానీని ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని షాద్మానీ ఉంటున్న ఒక రహస్య ప్రదేశంపై క్షిపణుల వర్షం కురిపించి ఆయన ప్రాణాలుతీసింది. భూతలం నుంచి భూతలం మీది లక్ష్యాలను ఛేదించే 120 మిస్సైల్‌ లాంఛర్లను నాశనం చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది.

ఎఫ్‌–14 రకం రెండు యుద్ధవిమానాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. 10 కమాండ్‌ సెంటర్లను నేలకూల్చామని పేర్కొంది. దీంతో ఇరాన్‌ సైతం తీవ్రస్థాయిలో బాలిస్టిక్‌ క్షిపణులతో బదులు చెప్పింది. టెల్‌ అవీవ్‌ సిటీలో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ కార్యాల యంపై మెరుపు దాడులు చేసింది. దీంతో ఆ భవనం ధ్వంసమైనట్లు వార్తలొచ్చాయి. టెల్‌ అవీవ్‌తోపాటు వెస్ట్‌ జెరూసలేంలోనూ బాంబుల మోతలు మోగాయి.

ఇజ్రాయెల్‌లోని హెర్జిలియాలో 8 అంతస్తుల భవంతి ధ్వంసమైంది. ఇకపై మరింతగా దాడులు చేస్తామని ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సయ్యద్‌ అబ్దుల్‌రహీం మౌసావీ ప్రకటించారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో ఇరాన్‌లో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,277 మంది గాయపడ్డారు. ఇరాన్‌ జరిపిన మిస్సైళ్ల దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. 500 మందికిపైగా పౌరులు గాయపడ్డారు.

హెర్జిలియాపై ఇరాన్‌ దాడిలో ధ్వంసమైన భవంతి నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు  , మిలటరీ కమాండర్‌ షాద్మానీ  

టెహ్రాన్‌లో హాహాకారాలు
ఇరాన్‌ గగనతల రక్షణవ్యవస్థ దెబ్బతినడంతో ఇజ్రాయెల్‌ క్షిపణులు పట్టపగ్గాల్లేకుండా విచ్చలవిడిగా విరుచుకుపడ్డాయి. దీంతో టెహ్రాన్‌ నగరవ్యాప్తంగా మంగళవారం అప్రమత్త సైరన్‌లు మోగుతూనే ఉన్నాయి. కొందరు ప్రాణభయంతో ఇళ్లలో, బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటే లక్షలాది మంది కాస్పియన్‌ సముద్రతీరాలకు వాహనాల్లో తరలిపోతున్నారు. వందలాది మంది సమీప అజర్‌బైజాన్‌ దేశానికి వలసవెళ్లారు. సొంత వాహనాల్లో జనం వలసవెళ్తుండటంతో రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. స్టాక్‌మార్కెట్‌ పనిచేయలేదు. సరఫరాలేక పెట్రోల్‌బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు కనిపించాయి. స్టాక్‌ ఉన్నచోట్ల చాంతాడంత              క్యూ లైన్లు కనిపించాయి.

ఖమేనీ జాడ తెలుసు... ఇప్పుడే చంపం: ట్రంప్‌
జీ7 సదస్సు నుంచి హడావిడిగా అమెరికాకు పయనమైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీ జాడపై మాట్లాడారు. ‘‘ ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ప్రస్తుతానికి ఆయనను అక్కడే తలదాచుకోనిద్దాం. ఆయనను చంపేందుకు మిస్సైళ్లను ప్రయోగిస్తే సాధారణ పౌరులు, అమెరికా జవాన్లూ చనిపోయే ప్రమాదముంది. అందుకే ఇప్పుడే ఆయనను చంపబోం. కానీ ఆయనను అలా ప్రాణాలతో ఎక్కువ రోజులు ఉండనివ్వం.

అసలే మాకు ఓపిక చాలా చాలా తక్కువ’’ అని ట్రంప్‌ అన్నారు. ‘‘ ఖమేనీగానీ, ఇరాన్‌గానీ మాకు వీలైనంత త్వరగా బేషరతుగా లొంగిపోతే మంచిది. అణుఒప్పందం కుదుర్చుకోవాలని ఇప్పటికే సూచించా. మధ్యవర్తిత్వం వహించాలనే ఆసక్తి నాలో తగ్గుతోంది. ఇరాన్‌ అణుఆశలపై నీళ్లు చల్లాం. నేను కాల్పుల విరమణను కోరుకోవట్లేదు. అంతకుమించిన ఫలితాన్ని ఆశిస్తున్నా. ఇప్పుడు ఈ సమస్యకు వాస్తవిక ‘ముగింపు’ పలకాల్సిందే’’ అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో మరో పోస్ట్‌పెట్టారు.

బంకర్‌ బస్టర్‌ బాంబు ఇవ్వండి
ఇరాన్‌లో ఫోర్దో అణుఇంధన శుద్ధి కార్మాగారం ఒక పర్వతం కింద భూగర్భంలో నిర్మించారు. దీనిని భూస్థాపితం చేస్తేగానీ ఇరాన్‌ అణు కార్యక్రమం ఆగదని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. అందుకే ఎలాగైనా బంకర్లను బద్దలుకొట్టే భారీ బాంబు కోసం అమెరికాను సాయం కోరనుంది. మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌(ఎంఓపీ)గా పిలుచుకునే జీబీయూ–57ఏ/బీ బాంబు బరువు ఏకంగా 14,000 కేజీలు. ఇది పేలితే అక్కడ భూమి 200 అడుగుల లోతుదాకా బద్ధలైపోతుంది. అంటే భూగర్భంలోని బంకర్, అణుస్థావరం పూర్తిగా సమాధిదిబ్బగా మారుతుంది.

అందుకే ఈ బంకర్‌ బస్టింగ్‌ బాంబును తమకు ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్‌ కోరుతున్నట్లు సమాచారం. ఇంతటి బరువైన బాంబును కేవలం బీ–2 స్టెల్త్‌ బాంబర్‌ యుద్దవిమానం నుంచే ప్రయోగించే వీలుంది. ఈ విమానం కూడా ఇజ్రాయెల్‌ వద్ద లేదు. ఇజ్రాయెల్‌ అభ్యర్థనను అంగీకరిస్తే అమెరికానే స్వయంగా తన విమానంతో ఈ బాంబును యురేనియం శుద్ధికర్మాగారంపై పడేయాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు వాడొద్దని నిషేధాజ్ఞలు
ఇజ్రాయెల్‌ తన శత్రుదేశంలో సైనికుల చేతుల్లోకి వాకీటాకీలు, రేడియోసెట్లను ఏకకాలంలో పేల్చి సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వ అధికారులు, వారి వ్యక్తిగత సహాయకులు ఎవరూ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఉపయోగించకూడదని ఇరాన్‌ నిషేధం విధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement