
రిపబ్లికన్ పార్టీ నేతల డిమాండ్
వాషింగ్టన్: అమెరికాలో న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీపడుతున్న భారత సంతతి నాయకుడు జోహ్రాన్ మమ్దానీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయన ఇప్పటికే డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఇండియన్–అమెరికన్ సినీ దర్శకురాలు మీనా నాయర్ కుమారుడైన మమ్దానీ పౌరసత్వంపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని, ఆయనను దేశం నుంచి వెళ్లగొట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ, దాని అనుబంధ గ్రూప్లు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన అమెరికా పౌరుడు కాదని వాదిస్తున్నాయి.
మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ముస్లిం మతస్థుడు కావడంతో కొన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని టెన్నెస్సీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ ఓగ్లెస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీకి లేఖ రాశారు. మమ్దానీ తప్పుడు ఆధారాలతో అమెరికా పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చారని, పైగా ఆ విషయం దాచిపెట్టారని ధ్వజమెత్తారు. రాడికల్ జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ను నాశనం చేస్తానంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్థానిక యంగ్ రిపబ్లికన్ క్లబ్ తేల్చిచెప్పింది. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే.
‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.