వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు  | India, Thailand support rules-based order in Indo-Pacific | Sakshi
Sakshi News home page

వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు 

Apr 4 2025 5:04 AM | Updated on Apr 4 2025 5:04 AM

India, Thailand support rules-based order in Indo-Pacific

భారత్, థాయ్‌లాండ్‌ నిర్ణయం

బ్యాంకాక్‌: ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛా యుత, సమ్మిళిత, న్యాయబద్ధమైన విధానాలకు కట్టుబడి ఉంటామని భారత్, థాయ్‌లాండ్‌ ప్రకటించాయి. విస్తరణ వాదం కాదు, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, థాయ్‌లాండ్‌ ప్రధాని పెటొంగ్‌టర్న్‌ షినవత్ర గురువారం బ్యాంకాక్‌లో సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. అంతకుముందు, రెండు దేశాల ప్రతినిధుల స్థాయి మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. 

భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు, థాయ్‌లాండ్‌ మధ్య పర్యాటకం, సాంస్కృతిక, విద్యా రంగాలతోపాటు పరస్పర వాణిజ్యం, పెట్టుబడుల్లో సహకారానికి గల అవకాశాలపై షనవత్రతో చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, చేనేత, హస్తకళల్లో సహకారంపై ఒప్పందాలు కుదిరాయన్నారు. ఇండో–పసిఫిక్, యాక్ట్‌ ఈస్ట్‌ విధానంలో థాయ్‌లాండ్‌కు భారత్‌ ప్రత్యేక స్థానం కల్పిస్తుందని తెలిపారు. భద్రతా విభాగాల మధ్య వ్యూహాత్మక సమావేశాలపైనా చర్చ జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా, మాజీ ప్రధాని థక్సిన్‌ షినవత్రాతోనూ మోదీ సమావే శమయ్యారు. 

తన పర్యటనను పురస్కరించుకుని 18వ శతాబ్దినాటి రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసినందుకు థాయ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని షినవత్ర తనకు బహూకరించిన త్రి పీఠకను బుద్ధుని భారత్‌ తరఫున వినమ్రుడనై స్వీకరించినట్లు తెలిపారు. బౌద్ధమత నియమాలతో కూడిన వినయ పీఠకం, సుత్త పీఠకం, అభిదమ్మ పీఠకాలని త్రిపీఠకాలని పేరు. మార్చి 28వ తేదీన భూకంపంతో సంభవించిన ప్రాణనష్టంపై భారత ప్రజల తరఫున నివాళులర్పించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.

 అంతకుముందు, బిమ్‌స్టెక్‌ 6వ శిఖరాగ్రానికి హాజరయ్యేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్యాంకాక్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ఉపప్రధాని సురియా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన థాయ్‌ రామాయణం, సిక్కులు ప్రదర్శించిన భాంగ్రా నృత్యం అలరించింది. అనంతరం ప్రధాని మోదీ బిమ్‌స్టెక్‌లోని బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారు యూనుస్, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్‌ సైనిక పాలకుడు మిన్‌ ఔంగ్‌ తదితరులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకాక్‌ నుంచి ఆయన శ్రీలంకకు వెళ్లనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement