మీ స్నేహం మరిచిపోం.. భారత్‌పై ఇరాన్ భావోద్వేగ పోస్ట్‌ | gratitude to friendly india irans thank you note amid khameneis funeral | Sakshi
Sakshi News home page

మీ స్నేహం మరిచిపోం.. భారత్‌పై ఇరాన్ భావోద్వేగ పోస్ట్‌

Jul 6 2026 10:00 PM | Updated on Jul 6 2026 10:00 PM

gratitude to friendly india irans thank you note amid khameneis funeral

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు భారత్ ప్రతినిధులు హాజరవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ భావోద్వేగ పోస్ట్ చేసింది. భారత సమాజానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ కష్టకాలంలో భారత్ చూపిన స్నేహం, సానుభూతి, హృదయపూర్వక గౌరవాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ (ఇరాన్) ఎప్పటికీ మరచిపోదని ఎక్స్ వేదికగా పేర్కొంది.

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌  ఖమేనీ అంత్యక్రియ వేడుకలకు భారత ప్రభుత్వం తరపున  బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో బృందం హాజరయి నివాళులర్పించింది. అదే విధంగా వ్యక్తిగతంగా  కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీలతో పాటు భారతదేశానికి చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు కూడా ఇరాన్ దివంగత నేతకు అంజలి ఘటించారు.

అయితే దీనిపై భారత్‌లోని  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.."భారత స్నేహపూర్వక ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, ముఖ్యంగా భారత్ తరపున హాజరైన అధికారిక ప్రతినిధి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇరాన్ అమరవీరుడు, హిస్ ఎమినెన్స్ అయాతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించినందుకు ధన్యవాదాలు." అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

"ఈ జాతీయ శోక సమయంలో ఇరాన్ ప్రజలతో భారత్ చూపిన హృదయపూర్వక సంఘీభావం, పరస్పర గౌరవానికి ఇది ఒక బలమైన నిదర్శనం. ఇరాన్ ప్రజలు ఈ స్నేహపూర్వక, సానుభూతితో కూడిన గౌరవపూర్వకమైన సంజ్ఞను ఎప్పటికీ మరచిపోలేరు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ఉన్న దీర్ఘకాలిక బంధానికి ఇదొక విలువైన నిదర్శనంగా వారు భావిస్తారు. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక విలువైన పునాదిగా నిలుస్తుంది." అని పోస్ట్ చేసింది


అలీ ఖమేనీ అంత్యక్రియలు
ఇరాన్ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ 'ప్రెస్ టీవీ' నివేదిక ప్రకారం.. అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు సోమవారం ఉదయం టెహ్రాన్‌లో ప్రారంభమైంది. ఈ ఊరేగింపు దాదాపు 10 నుండి 12 గంటల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఆ దేశ ఆధునిక చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద ప్రజా ప్రదర్శన (సమీకరణ) కానుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement