ముప్పు అనివార్యమైనప్పుడే ముందస్తు దాడులు: భారత్‌ | Govt On Thaw With Pakistan And China; Updates On Threats To Indians | Sakshi
Sakshi News home page

ముప్పు అనివార్యమైనప్పుడే ముందస్తు దాడులు: భారత్‌

Feb 26 2021 12:51 AM | Updated on Feb 26 2021 12:50 PM

Govt On Thaw With Pakistan And China; Updates On Threats To Indians - Sakshi

ఇటువంటప్పుడు ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి మూడో దేశం భూభాగంపై ముందస్తు దాడులకు దిగాల్సి వస్తోందని పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి: మూడో దేశం భూభాగం నుంచి ఎదురయ్యే సాయుధ దాడి ముప్పును ఎదుర్కొనేందుకే ముందస్తు దాడులకు పాల్పడాల్సి వస్తోందని భారత్‌ వ్యాఖ్యానించింది. మారుమూల ప్రాంతాల్లో ఉగ్రమూకలకు శిక్షణ, సాయం, ప్రోత్సాహం కల్పిస్తున్న ఈ దేశాలు సార్వభౌమత్వం ముసుగులో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపిం చింది. ఇటువంటప్పుడు ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి మూడో దేశం భూభాగంపై ముందస్తు దాడులకు దిగాల్సి వస్తోందని పేర్కొంది.

2001లో భద్రతా మండలి చేసిన నంబర్‌ 1368, 1373 తీర్మానాలు కూడా ముంబై దాడుల వంటి వాటిని నిలువరించేందుకు ఆత్మ రక్షణ చర్యలు అవసరమనే విషయాన్ని ధ్రువీకరి స్తున్నాయని తెలిపింది. మెక్సికో నేతృత్వంలో భద్రతామండలి అనధికారిక అరియా ఫార్ములా సమావేశంలో ఐరాసలో భారత డిప్యూటీ శాశ్వత రాయబారి నాగరాజ్‌ నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. మూడో దేశం దన్నుతో సాగే దాడులను నిలువరించాల్సిన తక్షణ, తీవ్ర పరిస్థితులు ఉత్పన్న మైనప్పుడు ఆత్మరక్షణ అనేది ఒక దేశం ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. పుల్వామా ఘటనకు ప్రతిగా పాక్‌లోని బాలాకోట్‌ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడులకు పాల్పడిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. 

పాక్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం: భారత్‌
న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాలను గట్టిగా పాటించాలని భారత్, పాక్‌ సైనిక బలగాలు నిర్ణయించుకున్నాయని భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. పాకిస్తాన్‌తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామనీ, రెండు దేశాల మధ్య అంశాలను శాంతియుతంగా పరిష్కరించు కునేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ‘కీలక అంశాలపై మా వైఖరిలో మార్పు ఉండదు. ఇదే విషయాన్ని మరోసారి చెప్పాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు.

భారత్, పాక్‌ల మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరళ్ల మధ్య హాట్‌లైన్‌ ద్వారా జరిగిన చర్చల అనంతరం రెండు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. వాస్తవ నియంత్రణ రేఖ సహా ఇతర ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలను బుధవారం అర్ధరాత్రి నుంచి తు.చ. తప్పకుండా పాటించేందుకు ఈ చర్చల్లో అంగీకారానికి వచ్చాయి. ఈ పరిణామంపై అనురాగ్‌ శ్రీవాస్తవ పై వ్యాఖ్యలు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement